అమరావతి – ఏపీలో చంద్రబాబు సీఎంగా కొలువు తీరాక మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి. తను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో అప్పు తీర్చలేదంటూ మహిళను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పక్కదారి పట్టిందన్నారు. మహిళలు, బాలికలు, యువతుల పట్ల అరాచకాలు, దారుణాలు మితిమీరి పోయాయని వాపోయారు .
బుధవారం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగత ప్రచారంపై ఉన్నంత శ్రద్ద చంద్రబాబు నాయుడుకు ప్రజల బాగోగులపై లేదన్నారు. ఎంతసేపు ఐటీ జపం తప్ప రాష్ట్రం గురించి పట్టించు కోవడం లేదన్నారు ఆర్కే రోజా సెల్వమణి. హామీల పేరుతో జనాన్ని బురిడీ కొట్టించారని, కానీ ఇప్పుడు కొత్త రాగం అందుకున్నాడంటూ ఎద్దేవా చేశారు.
కూటమి ఏడాది పాలనలో ఏం సాధించారో ప్రజలకు చెప్పాలన్నారు. ఏం ఒరగ బెట్టారని విజయోత్సవాలు జరుపుకుంటున్నారంటూ ప్రశ్నించారు ఆర్కే రోజా సెల్వమణి. జనం తమ పాలనను చూసి నవ్వుకుంటున్నారని, జగన్ పాలనే బాగుందంటూ మాట్లాడుతున్నారని, ఇకనైనా చంద్రబాబు కళ్లు తెరిచి చూస్తే బావుంటుందని హితవు పలికారు. ప్రజలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమి అడ్రస్ లేకుండా పోతుందంటూ జోష్యం చెప్పారు మాజీ మంత్రి. చంద్రబాబు నాయుడు మాటలు బక్వాస్ అని తేలిపోయిందన్నారు.