అమరావతి – మాజీ మంత్రి విడదల రజిని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ చీఫ్ జగన్ రెడ్డిని చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దేశంలోనే అత్యంత జనాదరణ పొందిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని, ఆయనను భూ స్థాపితం చేయాలని కొందరు ప్లాన్ చేస్తున్నారంటూ వాపోయారు. లక్షలాది మంది ప్రజలు తనను అభిమానిస్తున్నారని, రాబోయే రోజుల్లో కూటమి పాలనకు చెరమగీతం పాడక తప్పదన్నారు.
రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపులకు నారా చంద్రబాబు నాయుడు తెర లేపారంటూ మండిపడ్డారు విడదల రజిని. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. అధికారం అన్నది ఏ ఒక్కరికీ శాశ్వతం కాదన్నారు. ఆ విషయం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలకు వైసీపీ నేతలు భయపడరని పేర్కొన్నారు.
తాము ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తున్నామని, వారి తరపున పోరాడుతున్నామని దీంతో ఇచ్చిన హామీలను అమలు చేయలేక తమపై అక్రమ కేసులు, అరెస్ట్ లకు పాల్పడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ రెడ్డిని ముట్టుకునే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూటమి నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు విడదల రజిని.
ఇప్పటికే అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, తమ వారికి అప్పనంగా కట్టబెడుతూ అధికార దుర్వినియోగానికి కూటమి నేతలు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి. దీనిని ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా తాజాగా విడుదల రజిని చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి రాజకీయ వర్గాలలో.