కాకినాడ జిల్లా – మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి సర్కార్ కొనసాగుతున్నా పిఠాపురం నియోజకవర్గంలో ఇంకా వైసీపీ పాలనే కొనసాగుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఇరు పార్టీల మధ్య కొంత దూరాన్ని పెంచేలా చేశాయి. నియోజకవర్గంలో అక్రమ ఇసుక తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పాడ తీర గ్రామాలలో బొండు ఇసుక తవ్వకాలు జరుగుతున్నా ఎందుకు పట్టించు కోవడం లేదని నిలదీశారు.
వైసీపీ ముసుగులో ఇంకా వారి పాలనే పిఠాపురంలో సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు వర్మ. సహజ సంపదను దోచుకుంటున్నారని వాపోయారు . కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా అధికారుల వ్యవహార శైలి ఉందన్నారు. ఇప్పటికీ బొండు ఇసుక తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించు కోక పోవడం విడ్డూరమన్నారు. పోలీసులు అక్రమ ఇసుక తవ్వకం దారులతో కుమ్మక్కైనట్లు గా కనిపిస్తోందన్నారు వర్మ.
ఇటీవల కూటమి పార్టీలలో చేరిన వైసీపీ నేతలే ఈ తవ్వకాలకు ముఖ్య సూత్రధారులంటూ ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే. ఇటువంటి చర్యల వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పేరు పోయేలా ఉందన్నారు. అక్రమంగా మట్టి తవ్వకాలకు పవన్ పూర్తి వ్యతిరేకం అన్నారు. తన ఆశయాలకు వ్యతిరేకంగా ఇసుక తవ్వకాలు జరగడం దారుణమన్నారు వర్మ.