ఢిల్లీ -కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వాహనదారులకు మేలు చేకూర్చేలా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ఏడాదికి ఒకసారి రిచార్జ్ చేసుకుని 200 ట్రిప్పులు వరకు తిరిగే పాస్ ను తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ఏడాదికి రూ. 3 వేలు రీచార్జ్ చేసుకుని దేశంలో ఎక్కడైనా తిరిగే అవకాశం కల్పించినట్లు తెలి పారు. ఈ ఏడాది ఆగష్టు 15 నుంచి ఈ విధానాన్ని అమలులోకి తీసుకు వస్తున్నట్లు స్పష్టం చేశారు.
దీని వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడదని, త్వరగా వాహనాలకు లైన్ క్లియర్ చేయడం వీలవుతుందన్నారు. దీని వల్ల కీలకమైన సమయం కూడా కలిసి వస్తుందన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. దేశంలోని జాతీయ రహదారులపై నిర్బంధ రహిత ప్రయాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గంలో ఈ కీలక నిర్ణయానికి ఆమోద ముద్ర వేయడం జరిగిందని చెప్పారు.
పదే పదే రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఇక ఉండబోదన్నారు నితిన్ గడ్కరీ. ఇక వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఆగకుండా ఫాస్ట్ గా వెళ్లేందుకు దీని ద్వారా ఆస్కారం ఏర్పడుతుందని తెలిపారు కేంద్ర మంత్రి. ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ను ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా వాణిజ్యేతర, వ్యక్తిగత వాహనాలకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.