గుజరాత్ – ఐపీఎల్ క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో దారుణంగా ఓటమి పాలైంది ముంబై ఇండియన్స్ టీమ్. తొలుత బ్యాటింగ్ చేసిన హార్దిక్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే పని పూర్తి కానిచ్చేసింది. ప్రధానంగా స్కిప్పర్ శ్రేయస్ అయ్యర్ సూపర్ షో చేశాడు. కేవలం 41 బంతులు మాత్రమే ఎదుర్కొని 7 ఫోర్లు 8 భారీ సిక్స్ లతో విరుచుకు పడ్డాడు. తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టడంలో చివరి దాకా ఉన్నాడు. 87 పరుగులు చేశాడు.
తనతో పాటు యంగ్ క్రికెటర్లు నేహాల్ వధేరా 48 రన్స్ చేస్తే ఇంగ్లిష్ 38 పరుగులతో రాణించాడు. మొత్తంగా ఎంత మంది బౌలర్లను మార్చినా పంజాబ్ విజయాన్ని అడ్డు కోలేక పోయింది ముంబై ఇండియన్స్ ..మ్యాచ్ అనంతరం ముంబై స్కిప్పర్ హార్దిక్ పాండ్యా మీడియాతో మాట్లాడాడు. కీలకమైన పోరులో తమ జట్టు బౌలర్లు సరిగా బౌలింగ్ చేయడంలో విఫలం అయ్యారని ఒప్పుకున్నాడు. అదే క్రమంలో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు నాయకుడిగా ఉన్న శ్రేయస్ అయ్యర్ ను ప్రశంసలతో ముంచెత్తాడు.
తను కీలకంగా మారడంతో తాము ఏమీ చేయలేక పోయామని, రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పాడు. ఇదిలా ఉండగా టోర్నీలో వరుసగా నాలుగు మ్యాచ్ లు ఓడి పోయింది ముంబై. ఆ తర్వాత పుంజుకుంది. ఏకంగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. చివరకు క్వాలిఫయర్ -2లో అనూహ్యంగా ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.