హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఆయనకు విషయం తక్కువ విషం ఎక్కువ అంటూ మండిపడ్డారు. గోదావరి, కృష్ణా జలాల విషయంలో మీసమెత్తు అవగాహన లేదన్నారు. పదే పదే తాను నల్లమల పులిబిడ్డ అంటూ చెప్పడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. తాను పులి బిడ్డ కాదని వెకిలి మాటలు మాట్లాడే వెర్రి బిడ్డ అంటూ ఎద్దేవా చేశారు. చిల్లర మాటలు మాట్లాడటం పనిగా పెట్టుకున్నాడని, చివరకు తన వ్యక్తిత్వాన్ని తానే కించ పర్చుకునేలా వ్యవహరిస్తున్నాడని ఆవేదన చెందారు.
ప్రజా పాలన పేరుతో ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడని, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడడం వల్ల తనకే నష్టం జరుగుతుందని రేవంత్ రెడ్డి ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్నారు. ఇదే సమయంలో నీటి పారుదల శాఖ సలహాదారుపై కూడా సీరియస్ కామెంట్స్ చేశారు తన్నీరు హరీశ్ రావు. ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. పదే పదే బూతులు మాట్లాడితే జనం స్వీకరించరని స్పష్టం చేశారు.
ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ఇలా దిగజారుడు రాజకీయాలు చేయడం సబబు కాదన్నారు. 1000 టీఎంసీల నీళ్లను అప్పనంగా గోదావరి, కృష్ణా నదుల నుంచి అక్రమంగా మళ్లించుకు పోయేందుకు చంద్రబాబు స్కెచ్ వేశాడని, దమ్ముంటే దానిని అడ్డు కోవాలని సవాల్ విసిరారు హరీశ్ రావు. సొల్లు కబుర్లు చెప్పడం బంద్ చేసి పాలనపై దృష్టి సారించాలన్నారు.