హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఒకటి అంటూ ఉందని జనం ఏనాడో మరిచి పోయారంటూ ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను వంచించిన చరిత్ర సీఎం రేవంత్ రెడ్డిదన్నారు. ఓ వైపు రైతులు, ఇంకో వైపు ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులకు గురవుతుంటే నగరంలో అందాల పోటీలు నిర్వహించడం దారుణమన్నారు.
మిస్ వరల్డ్ 2025 పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 200 కోట్లు ఖర్చు చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. వీటిని నిర్వహించడం వల్ల రాష్ట్రానికి, ప్రజలకు ఒరిగింది ఏమిటో చెప్పాలని నిలదీశారు హరీశ్ రావు. ఎవరిని ఉద్దరించడానికి అందాల పోటీలు నిర్వహించారంటూ మండిపడ్డారు. ఇంగ్లండ్ కు చెందిన కంటెస్టెంట్ పై అనుచితంగా ప్రవర్తించి రాష్ట్ర గౌరవానికి మచ్చ తెచ్చారని అన్నారు.
ఎక్కడి నుంచి, ఎవరి నుంచి అప్పులు తీసుకు వచ్చారో చెప్పాల్సిన బాధ్యత సర్కార్ పై, సీఎంపై ఉందని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, నాగరికత గొప్పదన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి వచ్చాక పూర్తిగా తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.