అల్ప పీడ‌నం భారీ వ‌ర్షం

ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ

అమ‌రావ‌తి – ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కార‌ణంగా ఏపీలో భారీగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ హెచ్చ‌రించింది. ఉత్తర కర్ణాటక, దానిని ఆనుకుని ఉన్న తెలంగాణ, రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. ద్రోణి ఇప్పుడు పశ్చిమ-మధ్య అరేబియా సముద్రం నుండి దక్షిణ ఒడిశా తీరం వరకు కొనసాగుతుందని తెలిపింది. వీటి ప్ర‌భావం కార‌ణంగా చాలా చోట్ల వ‌ర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంది.

రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటుగా కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. చెదురు మదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

జూన్ 15న ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

పిడుగులతో కూడిన వర్షాలు నేపధ్యంలో చెట్లు, టవర్స్, పోల్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో నిలబడరాదని హెచ్చరించింది. ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాల వ‌ద్ద నిల‌బ‌డ వ‌ద్ద‌ని సూచించింది.

కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 50 మిమీ, అల్లూరి జిల్లా అడ్డతీగల 48. 5 మిమీ, అన్నమయ్య జిల్లా గుండ్లపల్లిలో 44.5 మిమీ, విజయనగరం జిల్లా గుల్ల సీతారామపురం 40.5 మిమీ, నంద్యాల జిల్లా చౌతకూరులో 32.7 మిమీ చొప్పున వర్షపాతం రికార్డైందని వెల్ల‌డించింది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com