హైదరాబాద్ – డ్రగ్స్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా హైదరాబాద్ పోలీసులు పట్టుకున్న డ్రగ్స్ రాకెట్ లో కీలక విషయం వెలుగు చూసింది. డ్రగ్స్ వ్యవహారంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన హీరో నవదీప్ ఉన్నాడని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు.
దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఉలిక్కిపడింది. మాదాపూర్ డ్రగ్స్ కేసు ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇందులో భాగంగా ఈ కేసుకు సంబంధించి హీరో నవదీప్ కు నోటీసులు జారీ చేయనున్నట్లు ప్రకటించారు సీపీ ఆనంద్.
గచ్చిబౌలి లోని స్నార్ట్ పబ్ తో పాటు జూబ్లీ హిల్స్ లోని టెర్రా కేఫ్ లో డ్రగ్స్ ( మత్తు పదార్థాలు) విక్రయాలు జరిగినట్లు ప్రకటించారు. ఇది పెను సంచలనం సృష్టించింది. షాడో సినీ నిర్మాత ఉప్పలపాటి రవి కూడా ఇందులో కీలకంగా ఉన్నాడని , అయితే తను పరారీలో ఉన్నాడని వెల్లడించారు సీవీ ఆనంద్.
మరో వైపు నిర్మాతతో పాటు పరారీలో ఉన్న శ్వేత జాడ కోసం వెదుకుతున్నామని చెప్పారు. గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడిన కబాలీ తెలుగు వెర్షన్ నిర్మాత కేపీ చౌదరి జాబితాలో ఈ అమ్మడు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.