హైదరాబాద్ – మట్టి, నిర్మాణ వ్యర్థాలు పోస్తే కఠిన చర్యలుంటాయని హైడ్రా హెచ్చరించింది. చెరువులపై నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు కమిషనర్ ఏవీ రంగనాథ్. మట్టిపోసిన వారిని సాక్ష్యాధారాలతో పట్టుకుని వారిపై క్రిమినల్ కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లు, ట్రాన్స్పోర్టర్లతో పాటు ఆయా సంఘాల ప్రతినిధులతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో హైడ్రా పలు సూచనలు చేశారు. ప్రకృతి సమతుల్యతకు చెరువుల పరిరక్షణ ఎంతో అవసరమని. ఆ దిశగా హైడ్రా పనిచేస్తోందని చెప్పారు.
బిల్డర్లు – ట్రాన్స్పోర్టర్లు కలసి.. మట్టిని ఎక్కడ పోయాలో ముందుగానే ఒక అవగాహనకు రావాలని సూచించారు. అలా కాదు.. ఎవరికి వారుగా వ్యవహరించి.. మట్టిని తరలించే పని కాంట్రాక్టర్కు అప్పగించామన్నారు. ఆయన ఎక్కడ పోస్తే మాకేంటి అనేట్టు బిల్డర్లు వ్యవహరిస్తే అందరి పైనా కేసులు పెడతామని హెచ్చరించారు. ట్రాన్స్పోర్టు ఖర్చులు మిగులుతాయని దగ్గర్లోని చెరువుల ఒడ్డున పడేస్తామంటే వారి వాహనాలను సీజ్ చేయడమే కాకుండా.. డ్రైవర్, వాహన యజమాని, మట్టిని ఎక్కడి నుంచి తెస్తున్నారో సదరు నిర్మాణ సంస్థ యజమానిపై కూడా క్రిమినల్ కేసులు పెడతామన్నారు.
శిఖం భూములలో కూడా మట్టి నింపరాదని సూచించారు. హైడ్రా పోలీసు స్టేషన్ కూడా అందుబాటులోకి వచ్చిందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇందులో కేసులు బుక్ అవుతాయన్నారు. చెరువుల వద్ద కూడా 24 గంటలూ నిఘా ఉందని పేర్కొన్నారు.