అమరావతి – ఏపీ వాతావరణ సంస్థ (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. ఈశాన్య రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో చెదురు మదురుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.రానున్న రెండు రోజులు వాతావరణం క్రింది విధంగా ఉండనున్నట్లు వివరించారు.
గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు కురిసే అవకాశం ఉందన్నారు.
నిన్న రాత్రి 7 గంటల నాటికి మన్యం జిల్లా రస్తాకుంటుబాయిలో 72.5మిమీ,తూర్పుగోదావరి రాజమహేంద్ర వరంలో 65.2మిమీ, అంబేద్కర్ కోనసీమ జిల్లా తాతపూడిలో 47మిమీ, ప్రకాశం జిల్లా కొలుకులలో 44.7మిమీ, ఆత్రేయపురంలో 42.5మిమీ చొప్పున వర్షపాతం రికార్డైందన్నారు.