గుజరాత్ – యావత్ ప్రపంచం ఉత్కంఠతో ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా మంగళవారం టాటా ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కప్ ఫైనల్ మ్యాచ్ కు వేదిక కానుంది. వాతావరణం చల్లబడడంతో వర్షం అడ్డంకిగా మారే ఛాన్స్ లేక పోలేదు. ఈ ఉత్కంఠ భరితమైన పోరులో ఎవరు గెలుస్తారనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ కీలక మ్యాచ్ లో రజత్ పాటిదార్ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు తలపడనున్నాయి.
ఈసారి జరుగుతున్న 18వ ఐపీఎల్ సీజన్ లో గతంలో ఎన్నడూ కప్ గెలుచుకోని జట్లు ఫైనల్ కు చేరుకోవడం విశేషం. ఇరు జట్లు బలంగా ఉన్నాయి. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో సత్తా చాటేందుకు సిద్దమయ్యాయి. దీంతో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ జరగనుంది. విరాట్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఆర్సీబీకి ఇది బిగ్ అడ్వాంటేజ్. ఇదే సమయంలో అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ దుమ్ము రేపుతోంది.
ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించేందుకు సిద్దమైంది. ప్రధానంగా చెప్పుకోవాల్సింది అయ్యర్ కెప్టెన్సీ. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తనపై ప్రశంసలు కురిపించారు. సామాన్యంగా ఆయన ఎవరినీ మెచ్చుకోడు. తనకు నచ్చితే తప్పా. లక్ష మందికి పైగా ప్రేక్షకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ ప్రేమికులు ఫైనల్ మ్యాచ్ కోసం కళ్లల్లో వత్తులు వేసుకుని చూస్తున్నారు.