గుజరాత్ – అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ పోరులో ఎట్టకేలకు 18 ఏళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. కప్ ను స్వంతం చేసుకుంది. 6 పరుగుల తేడాతో ప్రత్యర్థి జట్టు పంజాబ్ కింగ్స్ ను మట్టి కరిపించింది. ఆ జట్టు చివరి బంతి దాకా చేసిన పోరాటం ఫలించ లేదు. ఆర్సీబీ స్కిప్పర్ రజత్ పాటిదార్ కొత్తగా బాధ్యతలు చేపట్టాడు. ఎక్కడా ఒత్తిడికి లోనుకాకుండా అద్భుతమైన కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. మరోవైపు కోల్ కతాకు కప్ ను తీసుకు వచ్చేలా చేయడంలో కీలక పాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్ ఈసారి పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు సారథ్యం వహించాడు.
తను కూడా తక్కువేమీ కాదు. ఆ జట్టును 11 ఏళ్ల సుదీర్గ గ్యాప్ తర్వాత ఫైనల్ కు తీసుకు వచ్చాడు. క్వాలిఫయర్ -2లో బలమైన ముంబై ఇండియన్స్ ను మట్టి కరిపించి ఔరా అనిపించేలా చేశాడు. విచిత్రం ఏమిటంటే ఈ కీలక ఫైనల్ మ్యాచ్ లో తనను బోల్తా కొట్టించడంలో సక్సెస్ అయ్యాడు కెప్టెన్ రజత్ పాటిదారు. తనకు ఆఫ్ సైడ్ లో బంతి వేస్తే తప్పకుండా షాట్ కొడతాడని, కొంచెం బంతిని స్లోగా వేయమని షెఫర్డ్ కు సూచించాడు. తన ప్లాన్ వర్కవుట్ అయ్యింది. అయ్యర్ వచ్చీ రావడంతో ట్రై చేశాడు. షాట్ కొట్టడంతో అది కాస్తా బౌలర్ భువనేశ్వర్ కుమార్ చేతిలోకి వెళ్లి పోయింది.
దీంతో భారీ తేడాతో ఓటమి చెందుతుందని భావించారు. కానీ శశాంక్ సింగ్, జోష్ ఇంగ్లీష్ అద్భుతంగా ఆడారు. ఆర్సీబీ బౌలర్లను ఉతికి ఆరేశారు. ఇక ప్రత్యేకంగా చెప్పు కోవాల్సింది. పరుగుల వరద పారిస్తున్న సమయంలో ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ ను బోల్తా కొట్టించాడు తన అద్భుతమైన బంతితో కృనాల్ పాండ్యా. తను 4 ఓవర్లలో కేవలం 17 రన్స్ మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. ఒక రకంగా చెప్పాలంటే తనే ఈ మ్యాచ్ లో హీరో అని చెప్పక తప్పదు.