సృజనాత్మకత కలిగిన దర్శకుడు శేఖర్ కమ్ములకు ఈ ఏడాది మంచి శుభాన్ని ఇచ్చిందని చెప్పక తప్పదు. తను తీసిన కుబేర చిత్రం బాక్సాఫీస్ వద్ద పరుగులు తీస్తోంది. ఊహించని రీతిలో ఎలాంటి అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ. కానీ అనుకోని రీతిలో పాజిటివ్ టాక్ తో రాకెట్ కంటే స్పీడ్ గా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన తొలి షో నుంచే కాసుల వర్షం ప్రారంభమైంది. ఇప్పటికే నాలుగు రోజులలో కుబేర అందరినీ విస్తు పోయేలా ఏకంగా రూ. 50 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇది ఊహించని సక్సెస్ అని చెప్పక తప్పదు.
ఇక శేఖర్ కమ్ముల తీసుకున్న పాయింట్ చాలా చిన్నదే. కానీ దానికి అల్లిన కథ, చెప్పిన తీరు, తీసిన విధానం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీనికి కారణం స్క్రీన్ ప్లే, దర్శకుడి ప్రతిభ. ఎలాంటి హంగు, ఆర్భాటాలకు తావు ఇవ్వకుండా సినిమాను తీశాడు. ఇందులో తన సినీ కెరీర్ లో మొదటిసారి టాప్ హీరోలు, హీరోయిన్ ను పెట్టి తీశాడు. కొంత అనుమానం ఉన్నప్పటికీ ఆసియన్ సునీల్ ప్రతిష్టాత్మకంగా ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించాడు. ఇందుకు తనను అభినందించాల్సిందే.
విచిత్రం ఏమిటంటే కుబేర చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో కూడా విడుదల చేశారు. కానీ తెలుగు రాష్ట్రాలలో దుమ్ము రేపుతుండగా మిగతా ప్రాంతాలలో మాత్రం ఆశించిన మేర స్పందన రాలేదు. ఒక రకంగా మిశ్రమ స్పందన లభించింది. ఏది ఏమైనా నిర్మాతతో పాటు దర్శకుడికి ఒకింత సంతోషాన్ని ఇచ్చేలా చేసింది కుబేర చిత్రం. సినిమా సక్సెస్ కావడంతో మంగళవారం శేఖర్ కమ్ముల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.