హైదరాబాద్ – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు. జూన్ నెలాఖరు లోపు ఎలక్షన్స్ నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఇప్పటికే కార్యాచరణ రూపొందించడం జరుగుతోందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత గ్రామాలలో సర్పంచ్ లు, పురపాలిక సంస్థల్లో ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఎన్నికల నిర్వహణ, నియమ నిబంధనలపై పూర్తి వివరాలు వెల్లడించేందుకు గాను సోమవారం తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఆ తర్వాత ఎన్నికల తేదీలపై పూర్తి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి ఏడాదిన్నర పూర్తి కావస్తోంది. కానీ ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ గురించి దాటవేస్తూ వచ్చింది. ప్రకటించిన ఆరు హామీల అమలులో జాప్యం జరగడం , ప్రజల్లో తీవ్ర వ్యతిరేక వస్తుండడంతో ఎన్నికలపై కొంత ఆలస్యం జరిగింది. దీంతో ఆయా గ్రామాలు, పట్టణాలలో ఎన్నికల సందడి నెలకొంది.