బెంగళూరు – బెంగళూరులో నిర్వహించిన ఆర్సీబీ విజయోత్సవ సన్మాన కార్యక్రమం చివరికి విషాదాన్ని నింపేలా చేసింది. చిన్న స్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. వారంతా ప్రస్తుతం ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పూర్తిగా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది.
ఈ మేరకు ఆ పార్టీ ప్రతిపక్ష నాయకుడు అశోక నిప్పులు చెరిగారు. మీడియాతో మాట్లాడారు. ఘటనకు బాధ్యత వహిస్తూ తక్షణమే కర్ణాటక రాష్ట్ర హోం శాఖ మంత్రి జి. పరమేశ్వర రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాట కారణంగా చోటు చేసుకున్న మరణాలన్నీ నిస్సందేహంగా ప్రభుత్వ ప్రాయోజిత హత్యలేనని ఆరోపించారు.
ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫోటోలు తీసుకునేందుకు ఎయిర్ పోర్ట్ కు వెళ్లారంటూ మండిపడ్డారు. చివరి క్షణం వరకు కవాతు జరగాలా వద్దా అనే దానిపై పోలీసులకు స్పష్టత ఇవ్వలేదని వాపోయారు. దీనికి అంతటికీ సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి బాధ్యత వహించాలన్నా అశోక.
దాదాపు లక్ష మందికి పైగా వస్తారని అనుకున్న సమయంలో స్టేడియం వద్ద అంబులెన్స్ లు, అగ్ని మాపక వాహనాలను ఎందుకు ఏర్పాటు చేయలేక పోయారంటూ ప్రశ్నించారు. సర్కార్ ను నిలదీశారు.