అమరావతి – మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏపీ రాజధాని అమరావతిపై కొందరు నోరు పారేసుకోవడాన్ని తప్పు పట్టారు. వేశ్యల రాజధాని అంటూ పేర్కొనడాన్ని ఖండించారు. ఇది మంచి పద్దతి కాదని సూచించారు. ఎక్స్ వేదికగా ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు. స్వచ్చంధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల గురించి కొందరు నోళ్లు పారేసుకోవడం దారుణమన్నారు ముప్పవరపు వెంకయ్య నాయుడు.
ఇలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవని అన్నారు. అంతకు మించి హేయమైనవి. సభ్యసమాజం సహించలేనివని పేర్కొన్నారు మాజీ ఉప రాష్ట్రపతి. కేవలం ఒక్క ఎకరా భూమి ఉన్న రైతులు సైతం రాజధాని కోసం భూములు ఇవ్వడమే గాక, తదనంతర కాలంలో తమ మీద జరిగిన దమనకాండకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేశారని గుర్తు పెట్టుకోక పోతే ఎలా అని ప్రశ్నించారు.
అమరావతి ప్రాంతంలో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా, ప్రవృత్తిగా జీవనం సాగిస్తూ… భవిష్యత్ తరాల కోసం వారు చేసిన త్యాగాలు నిరుపమానమైనవని ప్రశంసించారు ముప్పవరపు వెంకయ్యనాయుడు. అలాంటి రైతులను, ముఖ్యంగా మహిళా మూర్తులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కిరాతకమైనవని వాపోయారు. ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి భంగం కలిగించడం క్షమించరాని నేరం. ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదిలా ఉండగా అమరావతి పట్ల వేశ్యల రాజధానిపై మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో వారు చేసిన ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా తూళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏకంగా చర్చ పెట్టిన యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును సోమవారం హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. గుంటూరుకు తరలించారు.