అలిపిరి టోల్ ప్లాజా పునరుద్ధరణ – ఈవో

భ‌క్తుల సౌక‌ర్యార్థం టీటీడీ నిర్ణ‌యం

తిరుమ‌ల – తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆధునిక సౌకర్యాలతో అలిపిరి టోల్ ప్లాజా ను పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు టిటిడి ఈవో జె శ్యామల రావు తెలిపారు. తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో అలిపిరి చెక్ పాయింట్ పునరుద్ధరణ, భద్రత పెంపుపై టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఈవో సమీక్ష నిర్వహించారు.

ముందుగా అలిపిరి టోల్ ప్లాజా వద్ద ఆధునిక సౌకర్యాలు, పటిష్ట భద్రత తదితర అంశాలపై జిఎంఆర్ గ్రూప్‌న‌కు చెందిన రాక్సా సంస్థ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భక్తుల చెకింగ్, లగేజీ స్కానింగ్ కి ప్రస్తుతం తీసుకుంటున్న సమయం, దాని వల్ల వస్తున్న సమస్యలపై అధికారులతో చర్చించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా వేగంగా వాహనాలు, లగేజీ స్కానింగ్ చేసేందుకు చర్యలు చేపట్టాలని జీఎంఆర్ అనుబంధ సంస్థ అయిన రాక్సా సంస్థ ప్రతినిధులకు ఈవో సూచించారు.

అలిపిరి చెక్ పాయింట్ వద్ద చెకింగ్ సమయాన్ని తగ్గించేందుకు దీర్ఘకాలిక, స్వల్ప కాలిక పరిష్కార మార్గాలను సూచించాలని కోరారు. టిటిడి విజిలెన్స్ విభాగం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని భక్తుల లగేజీ, వాహనాల స్కానింగ్ లో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని ఈవో ఆదేశించారు. తనిఖీ సమయంలో క్రాస్ ఓవర్‌లను నివారించ‌డం, ఉన్న లగేజ్ స్కానర్‌ల స్థానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్కానర్లు ఏర్పాటు చేయాల‌న్నారు. లగేజ్ స్కానింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు లగేజ్ స్కానర్‌లను పెంచాల‌న్నారు.

రాబోయే రెండు దశాబ్దాల పాటు భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక భద్రతా అంశాల ప్రతిపాదనలు సూచించాలని రాక్సా ప్రతినిధులను ఈవో కోరారు. ఈ కార్యక్రమంలో రాక్సా సీఈవో అమిత్ దార్, టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం, సీవిఎస్వో మురళీ కృష్ణ, సీఈ సత్యనారాయణ, ఈఈ వేణు గోపాల్, ఐటీ జీఎం శేషారెడ్డి, వీజీవోలు సదా లక్ష్మి, రామ్ కుమార్, సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com