స్వహస్తాలతో పేదలకు పెన్షన్లు ఇవ్వడం మరిచి పోలేనని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబోమ్మాళి మండలం ఉమిలాడ గ్రామంలో జరిగిన పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు మంత్రి స్వయంగా వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ ఫథకాలు సంతృప్తిని ఇస్తున్నాయని, ప్రతినెల ఉదయాన్నే ఇంటికి తెచ్చి ఇవ్వడం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.
పేదల సేవలో పేరిట నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనటం చాలా ఆనందంగా ఉందన్నారు. పేదల పింఛన్ల పంపిణీకి ఏడాదికి రూ.33, వేల కోట్లు కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. ప్రతి నెలా 63 లక్షల మందికి 28 రకాల పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. పొరుగు రాష్ట్రాలలో ఇంత మొత్తంలో పింఛన్లు ఇవ్వడం లేదని, మన రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమంగా నిలుస్తోందని చెప్పారు.
పేదలకు భరోసా ఇచ్చే కార్యక్రమంలో స్వయంగా పాల్గొని పింఛను ఇవ్వడం నాకు ఎంతో సంతృప్తిని ఇస్తోందని, అందుకే ప్రతి నెలా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నానని తెలిపారు. ప్రజల స్థితిగతులు, సాధకబాధలు తెలుసు కోవడంతో పాటు, నా చేతులతో పింఛను ఇవ్వడం, నాకెంతో సంతృప్తినిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పీఎసీఎస్ అద్యక్షుడు కింజరాపు హరివర ప్రసాద్ ,ఆర్డీవో కృష్టమూర్తి, అధికారులు, తెలుగు దేశం ముఖ్య నాయకులు పాల్గొన్నారు.