అమరావతి – మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రోడ్లు, రైళ్లు, ఎయిర్ పోర్టులు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్ అనుసంధానం చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు కలిపి మొత్తంగా 20 కి తగ్గకుండా.. అదే సమయంలో ఖచ్చితంగా 14 ఎయిర్ పోర్టులు ఉండే విధంగా భవిష్యత్తు కార్యాచరణతో ముందుకు సాగుతామన్నారు. ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మంత్రి మీడియాతో మాట్లాడారు. ఎయిర్ పోర్టుల TEFR తయారీకి కన్సల్టెంట్ల ఎంపిక టెండర్ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామన్నారు. రాష్ట్రంలోని నాగార్జున సాగర్, ఒంగోలులో ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ప్రాజెక్టుల అభివృద్ధి కోసం టెక్నో ఎకనామిక్ ఫీజిబులిటీ స్టడీ రిపోర్ట్ (TEFR) తయారీకి కన్సల్టెంట్ ఎంపిక కోసం టెండర్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించినట్లు మంత్రి తెలిపారు. ఈ రెండు ఎయిర్ పోర్ట్ ల అభివృద్ధిలో భాగంగా ఆయా జిల్లా కలెక్టర్ ల ఆధ్వర్యంలో ఇప్పటికే అనుకూలమైన ప్రాంతాలను గుర్తించడం జరిగిందన్నారు. వీటికి సంబంధించి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ముందస్తు సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని కూడా పూర్తి చేసిందని తెలియజేశారు.ఇప్పటికే అమరావతి, కుప్పం ఎయిర్ పోర్టుల అభివృద్ధికి టెక్నో ఎకనామిక్ ఫీజిబులిటీ స్టడీ రిపోర్ట్ (TEFR) తయారీకి కన్సల్టెంట్ ఎంపిక కోసం టెండర్ ప్రక్రియకు ఆమోదం తెలిపామన్నారు.
2025-26 ఆర్థిక సంవత్సంలో కర్నూలు విమానాశ్రయం కార్యకలాపాల కోసం 2 పనులకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతిని ఇచ్చిందని తెలిపారు బీసీ జనార్దన్ రెడ్డి. రన్వేస్ ఎండ్ సేఫ్టీ (RESA) సరిదిద్దడానికి, ఇతర నిర్వహణ పనులకు రూ. 3.6 కోట్లు, కర్నూలు ఎయిర్ పోర్టులో టాక్సీవే టు ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (FTO) అందించడం కోసం రూ. 4.433 కోట్లకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ లో (APSFL) గతంలో 29 సంస్థలకు చెల్లించాల్సిన రూ. 70.82 కోట్లకు బిల్లులు అందజేయడానికి ఆమోదం తెలపడం జరిగిందన్నారు.