న్యూఢిల్లీ – దేశ రాజధాని పర్యటనలో బిజీగా ఉన్నారు మంత్రి నారా లోకేష్. ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను లోకేష్ వివరించారు.
ఈనెల 21న విశాఖలో ప్రధాని మోదీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరిస్తూ కొత్త ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని అమిత్ షాకు అందజేశారు.
సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల్లో చైతన్యాన్ని నింపిన లోకేష్ ను అమిత్ షా ప్రత్యేకంగా అభినందించారు. చంద్రబాబు సుదీర్ఘ పాలన అనుభవం ఏపీని అభివృద్ధి బాటలో నడిపిస్తుందన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారుకు కేంద్ర సహకారం కొనసాగుతుందని అమిత్ షా భరోసా ఇచ్చారు మంత్రికి.
ఇదిలా ఉండగా ఏపీ సర్కార్ కు కేంద్రంలోని మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సీసీఎస్ కింద అమరావతిలో ఆంధ్ర, కేంద్ర ఉద్యోగుల భవనాల కోసం ఏకంగా రూ. 2, 700 కోట్లకు పైగా నిధులను మంజూరు చేసింది. మరో వైపు ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యేందుకు నిధులు వెంటనే విడుదల చేయాలని మరోసారి షాకు విన్నవించారు లోకేష్.