ఢిల్లీ – ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన కుటుంబంతో ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్బంగా ఈ ఇద్దరి మధ్య దాదాపు 2 గంటలకు పైగా సమావేశం జరగడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, చోటు చేసుకున్న పనులు , సంక్షేమ పథకాలతో పాటు తాజాగా పరిస్థితుల గురించి కూలంకుశంగా ప్రధానికి వివరించారు నారా లోకేష్. ఆయనతో పాటు భార్య నారా బ్రాహ్మణి, తనయుడు కూడా ఉన్నారు.
ఇదే సమయంలో ఈనెల 21న ప్రపంచ యోగా డే సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది ఏపీ సర్కార్. ఈ కార్యక్రమానికి వేదిక కానుంది విశాఖపట్నం. ఈ యోగా ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దీంతో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. మే 21 నుంచి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగా మంత్ నిర్వహించాలని ఆదేశించాడు. ప్రతి చోటా ప్రతి నోటా యోగా పేరు మారుమ్రోగాలని పిలుపునిచ్చారు.
దాదాపు లక్ష మందితో ఈ కార్యక్రమాన్ని నభూతో నభవిష్యత్ అన్న రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. ఇది రికార్డ్ గా మిగలనుందని పేర్కొన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇదే సమయంలో మోదీకి ప్రత్యేకంగా ఓ గిఫ్ట్ కూడా అందజేశారు నారా లోకేష్. తన తనయుడిని ముద్దు చేశారు ప్రధానమంత్రి. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.