హైదరాబాద్ – దత్తన్న అలియాస్ బండారు దత్తాత్రేయ రాజకీయ ప్రస్థానం, వ్యక్తిత్వం స్పూర్తి దాయకమని కొనియాడారు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. హైదరాబాద్లో “ప్రజల కథే నా ఆత్మకథ” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. దీనిని దత్తన్న జీవిత కథగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. పలువురు ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు దత్తన్న గురించి గొప్పగా చెప్పారు. అలయ్ బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హరియాణా గవర్నర్ పుస్తకాన్ని ప్రచురించారు.
ఈ ఆత్మకథ దత్తాత్రేయ సుదీర్ఘ ప్రజా జీవితాన్ని ప్రతిబింబిస్తుందన్నారు మంత్రి సత్య కుమార్ యాదవ్. విద్యార్థి పరిషత్ రోజుల నుంచే దత్తాత్రేయతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. కులం, మతం, చిన్నా పెద్దా , ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించే గొప్ప వ్యక్తి దత్తన్న అంటూ కొనియాడారు.
ఒకే రోజులో 10 పెళ్లిళ్లకు హాజరయ్యే వారని. ఏదైనా పెళ్లికి వెళ్లలేక పోతే ఆ తరువాత రోజున ఆ కుటుంబాన్ని స్వయంగా కలసి తన ప్రేమాభిమానాలు చాటే వారని ప్రశంసించారు సత్య కుమార్ యాదవ్. ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధం అటువంటిదని పేర్కొన్నారు.
భాజపాలో ప్రతి కార్యకర్త పట్ల దత్తాత్రేయకి అమితమైన గౌరవం ఉందన్నారు. ఆప్యాయత ఉంటుందని, ప్రతి నాయకుడిని పేరుపేరునా గుర్తుంచుకుని వారి యోగక్షేమాలు అడగడం ఆయన విశిష్టత అని ప్రశంసలు కురిపించారు. ఈ పుస్తకం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని సత్యన్న అభిప్రాయపడ్డారు.