అమరావతి – ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. గత ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారంటూ మండిపడ్డారు. అంతే కాకుండా రాష్ట్ర రాజధాని అమరావతిని శ్మశానంగా మార్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అందుకే ప్రజలు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం చేశారంటూ ఫైర్ అయ్యారు సత్యకుమార్ యాదవ్.
కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అద్భుత నిర్మాణం జరుగుతోందని చెప్పారు మంత్రి. కేంద్రం కూడా నిధులు ఇచ్చి రాజధాని అభివృద్ధికి సహకరిస్తోందని చెప్పారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరాన్ని నిర్లక్ష్యం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పోలవరంపై సమీక్షలు నిర్వహించిన దాఖలాలు కూడా లేవన్నారు సత్య కుమార్ యాదవ్. ఇవాళ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంతరం సమీక్షలు చేస్తూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. కూటమి ఏడాది పాలనపై మంత్రి సత్యకుమార్ స్పందించారు.
వైసీపీ హయాంలో ఆర్థిక సంఘం నిధులు, గ్రామీణ ఉపాధి పథకం నిధులను దారి మళ్లించారని ధ్వజమెత్తారు. దీని వల్ల గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్ కు కేంద్రం నిధులు ఇచ్చినా.. రాష్ట్ర వాటాలను వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదంటూ ధ్వజమెత్తారు సత్య కుమార్ యాదవ్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కూటమి పాలనలో పల్లెలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని చెప్పారు.