గుంటూరు జిల్లా – వైసీపీ ఆరోపణలు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే, మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించ లేకపోతే పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అంటూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత జగన్ కు సవాల్ విసిరారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడారు.వైసీపీ ఆరోపిస్తున్నట్లు ‘తల్లికి వందనం’ నిధులు లోకేష్ జేబులోకి వెళ్లినట్లు నిరూపించాలని అన్నారు.
విద్య విలువ తెలిసిన నాయకుడు నారా లోకేష్ అయితే.. విద్యకు ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వం అన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అంత మందికి అమ్మఒడి ఇచ్చి మాట నిలబెట్టుకున్నారని అన్నారు ఎస్. సవిత. విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారని అన్నారు. 67 లక్షల 27 వేల 164 మందికి తల్లికి వందనం అందజేశామని అన్నారు.
దాదాపు 8,745 కోట్లు తల్లికి వందనం కింద డైరెక్టుగా తల్లుల అకౌంట్లలోకి నిధులు జమ అయ్యాయని స్పష్టం చేశారు మంత్రి ఎస్. సవిత. తల్లిదండ్రులు, పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ తల్లికి వందనం ఇవ్వడం గొప్ప విషయం అన్నారు. ఇందులో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ బాబు ల కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. తల్లికి వందనం పథకానికి 10వేల 091 కోట్లు , పాఠశాలల అభివృద్ధి కోసం 13 వేల 46 కోట్లు వెచ్చించామని చెప్పారు.