ఛత్తీస్ ఘడ్ లో సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు తో సహా మరో 27 మంది మావోయిస్టులను ఎన్ కౌంటర్ చేయడం పట్ల సిపిఐ తీవ్రంగా ఖండిస్తున్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. శాంతి చర్చలకు సిద్ధమేనని మావోయిస్టులు ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఏకపక్షంగా ఎన్ కౌంటర్లు చేయడం అప్రజాస్వామికమని ఆయన పేర్కొన్నారు.
సమాజంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక వాదులు, అభ్యుదయ వాదులు, మేధావులు రచయితలు తక్షణమే మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతున్నప్పటికీ కేంద్రం మొండి వైఖరి ప్రదర్శించడాన్నీ తీవ్రంగా ఖండించారు. ఎలాంటి సమస్యకైనా చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని చరిత్ర రుజువు చేస్తుందని కూనంనేని అన్నారు. తక్షణమే ఆపరేషన్ కగారు నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరిపి శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని ఆయన కోరారు.ఇదిలా ఉండగా ఛత్తీస్ గఢ్ లో భారత బలగాలు జరిపిన కాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మావోయిస్టు అగ్ర నేత సంబాల కేశవరావుతో పాటు మరో 27 మంది నక్సల్స్ ను మట్టుపెట్టారు. తను ఉన్నాడన్న పక్కా సమాచారంతో చుట్టుముట్టారు. సంబాల చని పోయినట్లు ఎక్స్ వేదికగా కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. సాంకేతికతను వాడడంలో తను ఎక్స్ పర్ట్. 2018లో గణపతి రాజీనామా తర్వాత మావోయిస్ట్ పార్టీకి సుప్రీం కమాండర్ అయ్యారు.