హైదరాబాద్ – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీల జపం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ పై ఒత్తిడి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం బీసీ నాయకుడు , జాతీయ బీసీ సంఘం నేత , ఎంపీ ఆర్ . కృష్ణయ్య ఇంటికి వెళ్లారు. సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్బంగా కవిత మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటి వరకు దీనిపై నోరు మెదపడం లేదన్నారు కవిత.
ఇప్పుడు సర్కార్ కొత్త రాగం అందుకుందుంటూ ఆరోపించారు . అసెంబ్లీలో బిల్లు పాస్ చేశామని, కేంద్రం ఆమోదిస్తేనే అమలవుతుందని కుంటి సాకులు చెబుతోందంటూ మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజా ఉద్యమాలే శరణ్యమని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత. అందు కోసమే ఆర్ కృష్ణయ్య మద్దతు కోరడానికి వచ్చానని అన్నారు కల్వకుంట్ల కవిత.
బీసీల కోసం అన్ని సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలన్నారు ఈ సందర్బంగా ఆర్ . కృష్ణయ్య.
ప్రభుత్వానికి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి లేదన్నారు. బీసీల కోసం కవిత ముందుకు వచ్చి మాట్లాడుతుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కవితక్కకు బీసీలు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. బీసీలు పోరాటం చేసే చారిత్రక సందర్భం వచ్చిందన్నారు. బీసీలకు 75 ఏళ్లుగా అన్యాయం జరుగుతోందన్నారు. కవిత బీసీ కాకపోయినా బీసీల కోసం పోరాడుతున్నారని అన్నారు.