కార్తికేయ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు నటుడు నిఖిల్ సిద్దార్థ్. తన పుట్టిన రోజు సందర్బంగా మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. తను తాజాగా నటిస్తున్న చిత్రం స్వయంభు. కార్తికేయ-2 సీక్వెన్స్ మూవీలో అసమాన నటనతో ఆకట్టుకున్నాడు. పలు అవార్డులు కూడా వరించాయి తనను. దీంతో తను నటిస్తున్న తదుపరి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మధ్యన కేవలం కథా పరంగా బాగుంటేనే ఓకే చెబుతున్నారు యంగ్ హీరోస్.
తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి. దీంతో నూతన దర్శకులు, నటీ నటులు బలమైన కథ ఉంటే వెంటనే నటించేందుకు ఒప్పుకుంటున్నారు. దీని వల్ల తమ సినీ కెరీర్ కు ఎలాంటి ఇబ్బంది అంటూ ఉండదని భావిస్తున్నారు. ప్రత్యేకించి చాలా జాగ్రత్తగా సినిమాలను సెలెక్టు చేసుకోవడం విశేషం.
అదే బాటలో ప్రస్తుతం నిఖిల్ సిద్దార్థ్ ప్రయాణం చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో స్వయంభు రాబోతోందని దర్శకుడు ఇప్పటికే వెల్లడించాడు. ఇక హీరో కెరీర్ లో ఇది 20వ సినిమా . ఈ కొత్త చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు. చారిత్రక యాక్షన్ ఇతిహాసం ప్రధానంగా తెరకెక్కిస్తున్నాడు . మునుపెన్నడూ చూడని అవతారంలో నిఖిల్ ను చూపిస్తున్నాడు డైరెక్టర్. పురాణ యోధుడి పాత్ర పోషిస్తున్నాడు.
విక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు స్వయంభు చిత్రాన్ని. ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. అద్భుతమైన సాంకేతిక నేపథ్యంతో ఇది రాబోతోందని తెలిపాడు దర్శకుడు కృష్ణమాచారి.