తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా గద్దర్ పేరుతో ఫిలిం అవార్డులను ప్రకటించింది. 2014 నుంచి 2023 సంవత్సరానికి గాను ఏకకాలంలో మొత్తం 30 సినిమాలను ఎంపిక చేసింది. వివిధ కేటగిరీలలో పురస్కారాలను ప్రకటించింది. ఇందులో స్పెషల్ కేటగిరీ కింద ఆరు విభాగాలను ఎంపిక చేసింది.
తెలుగు చలన చిత్ర రంగంలో తన జీవితకాలం అటు సినిమాలలో ఇటు రాజకీయాలలో రారాజుగా వెలుగొందిన నటుడు, నట సార్వభౌమ బిరుదు పొందిన మాజీ సీఎం, దివంగత నందమూరి తారక రామారావు పేరుతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు కోసం తన తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఎంపిక చేసింది.
ఆయనకు ఇటీవలే మోదీ కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు పొందారు బాలకృష్ణ. అంతే కాదు వయసు దాటినా ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. ఓ వైపు సినిమాలలో మరో వైపు ఆహాలో అన్ స్టాపబుల్ షో నిర్వహిస్తున్నారు. ఇది దేశంలోనే అత్యధిక టాప్ రేటింగ్ కలిగిన రియాల్టీ షోగా నిలిచింది.
తాజాగా ఆయన నటించిన చిత్రం డాకు మహారాజ్ ఈ ఏడాది బిగ్ సక్సెస్ సాధించింది. అత్యధిక వసూళ్లను కొల్లగొట్టింది. దీనికి బాబ్జీ దర్శకత్వం వహించాడు. రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ చేసి రికార్డ్ గా నిలిచింది. తాజాగా ఈ అవార్డును ప్రకటించడం పట్ల బాలయ్య సంతోషం వ్యక్తం చేశారు.