పాకిస్తాన్ – నిన్నటి దాకా అబద్దాలు ఆడుతూ వచ్చిన పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎట్టకేలకు నిజం ఒప్పుకున్నాడు. భారత దేశం తమ స్థావరాలను టార్గెట్ చేసింది నిజమేనని పేర్కొన్నాడు. ఇస్లామాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. భారతదేశం ప్రయోగించిన క్షిపణి దాడుల గురించి ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్ తెల్లవారుజామున 2:30 గంటలకు కాల్ చేశాడని చెప్పారు.
మే 10 తెల్లవారుజామున భారత బాలిస్టిక్ క్షిపణులు నూర్ ఖాన్ ఎయిర్బేస్ , పాకిస్తాన్లోని ఇతర లక్ష్యాలను ఢీకొట్టాయని తెలిపాడు పీఎం. రావల్పిండి, ఇస్లామాబాద్ మధ్య ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్, పాకిస్తాన్ వైమానిక కార్యకలాపాలకు చాలా కాలంగా కేంద్రంగా ఉన్న ఒక వ్యూహాత్మక సైనిక కేంద్రం. గతంలో చక్లాలా ఎయిర్ బేస్ అని పిలువబడే దీనిని 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో భారత దళాలు కూడా లక్ష్యంగా చేసుకున్నాయి.
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రసంగంతో కూడిన వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలివియా. భారత్ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ తీవ్రంగా నష్ట పోయిందని కూడా అంగీకరించారని తెలిపారు. ఇదిలా ఉండగా గత ఏప్రిల్ 22న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గామ్ లో 26 మంది పర్యాటకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. ఆ తర్వాత భాతర్ ఆపరేషన్ సిందూర్ మిషన్ ను ప్రారంభించింది. చివరకు ఎట్టకేలకు పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. చర్చలకు సిద్దమైంది.