కాకినాడ జిల్లా – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉదారతను చాటుకున్నారు. పిఠాపురం నియోజక వర్గవ్యాప్తంగా ఉన్న 325 మంది ప్రైవేట్ ఎలక్ట్రిషియన్లకు రక్షణ, భద్రత ఉండాలనే ఉద్దేశంతో స్వయంగా సేఫ్టీ కిట్స్ ను పంపిణీ చేశారు. మల్లం గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఎలక్ట్రిషియన్ సురేష్ మరణం తనను బాధకు గురి చేసిందన్నారు ఈ సందర్బంగా ఏపీ డిప్యూటీ సీఎం. శ్రమ జీవుల స్వేదమే దేశానికి నిజమైన సంపద అన్నారు.
వారి అభ్యున్నతి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు జ. ప్రాణాలు పణంగాపెట్టి పని చేసే ఎలక్ట్రీషియన్లకు రక్షణ, భద్రత చాలా ముఖ్యమని అన్నారు. నిరుద్యోగ యువత కోసం పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి మూడు నెలలకోసారి జాబ్ మేళా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 325 మంది ప్రైవేటు ఎలక్ట్రీషియన్లతో సమావేశమయ్యారు. పని ప్రదేశాల్లో వారి రక్షణ, భద్రత కోసం సేఫ్టీ కిట్లను అందజేశారు. ఈ సేఫ్టీ కిట్ లో ఎలక్ట్రికల్ పనులకు అవసరమైన టూల్ కిట్, రబ్బర్ హాండ్ గ్లోవ్స్, షూస్, జాకెట్ ఉన్నాయి.
ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసే వారికి రక్షణ, భద్రత కల్పించాలని వ్యక్తిగతంగా కోరుకునేవాడిని తాను అన్నారు. సురేష్ మరణం వెనుకనున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే రెండు అంశాలు స్పష్టమయ్యాయని తెలిపారు. ఒకటి ఆయన పేదరికం. విద్యుత్ పనులు చేసేటప్పుడు వాడే రక్షణ పరికరాలు తన దగ్గర లేకపోవడంతో మరణించారని అన్నారు.
రెండవది ప్రమాదవశాత్తు ఆయన చనిపోతే అతని కుటుంబానికి ఆదుకునేందుకు సరైన ఆర్థిక భద్రత లేకపోవడం. ఇటువంటి సంఘటన మళ్లీ పునరావృతం కాకూడదనే నిశ్చయంతో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 325 మంది ప్రైవేటు ఎలక్ట్రీషియన్లకు రక్షణ పరికరాల కిట్లను అందజేశామన్నారు.