పవర్ స్టార్ , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గతంలో ఎన్నడూ లేని రీతిలో తెలుగు చలన చిత్ర పరిశ్రమపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు తాము ఉన్నామన్న సంగతే మరిచి పోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు చిత్రసీమలో ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత లేదంటూ నిప్పులు చెరిగారు. సినిమా వాళ్లెవరూ వ్యక్తిగతంగా కలవడానికి రావద్దంటూ సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్నా తెలుగు సినీ సంఘాల ప్రతినిధులు సీఎంను మర్యాద పూర్వకంగా కలవక పోవడం దారుణమన్నారు పవన్ కళ్యాణ్ కొణిదల.
గత ప్రభుత్వం సినిమా రంగం వారిని, అగ్ర నటులను ఎలా ఛీత్కరించిందో మరిచి పోయారని పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం. కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదని, సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందంటూ స్పష్టం చేశారు. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు అంటూ ఉండవని పేర్కొన్నారు. కేవలం తమ సర్కార్ తో మాట్లాడాలంటే కేవలం సినీ సంఘాల ప్రతినిధులే రావాల్సి ఉంటుందని కుండ బద్దలు కొట్టారు.
సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం నిర్మాణ సారథ్యంలో జయకృష్ణ దర్శకత్వం వహించిన హరి హర వీరమల్లు చిత్రంలో కీలక పాత్ర పోషించాడు పవన్ కళ్యాణ్ కొణిదల. ఆయనతో పాటు ప్రముఖ నటి నిధి అగర్వాల్ కూడా నటించింది. అయితే ఈ సినిమాను జూన్ 12న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మూవీ మేకర్స్.
ఈ సినిమా కంటే ముందే సినిమా ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమకు వర్కవుట్ కావడం లేదని, అందుకే టాకీసులను మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా దీని వెనుక పెద్ద కుట్ర కోణం దాగి ఉందంటూ విచారణకు ఆదేశించారు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్.