గుజరాత్ – అహ్మదాబాద్ లో విమానం కూలి పోయిన ఘటనా స్థలాన్ని శుక్రవారం సందర్శించారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. భారీ భద్రత నడుమ ఆయన చేరుకున్నారు. ఈ ఘటనలో ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలు కోల్పోగా ఒకే ఒక్కరు మాత్రం బతికి బయట పడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తనను ప్రత్యేకంగా పరామర్శించారు పీఎం. మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ మొత్తం ఘటన పట్ల యావత్ భారతమంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఎయిర్ ఎండియా టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ . చంద్రశేఖరన్ కీలక ప్రకటన చేశారు.
మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. కోటి చొప్పున చెల్లిస్తామన్నారు. వైద్య ఖర్చులను భరిస్తామని, అంతే కాకుండా విమానం కూలిన ఘటనలో దెబ్బ తిన్న బీజే భవన పునర్ నిర్మాణం కోసం సాయం చేస్తామన్నారు. అంతకు ముందు పీఎం నేరుగా ఎయిర్ పోర్టు నుంచే కూలి పోయిన స్థలం మేఘా నగర్ కు చేరుకున్నారు. మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణీకులు, సిబ్బందితో పాటు మెడికల్ క్వార్టర్స్ కు చెందిన 24 మంది చని పోయారు. పీఎం మోదీతో పాటు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా ఉన్నారు.
ఇదిలా ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 ఏళ్ల పాటు పని చేశారు. ఈ విషాదం తనను విస్తు పోయేలా చేసిందన్నారు. అత్యంత బాధాకరం, హృదయ విదారకమని పేర్కొన్నారు. ఈ విచారకరమైన సమయంలో, నా ఆలోచనలు దాని బారిన పడిన ప్రతి ఒక్కరితో ఉన్నాయన్నారు మోదీ. నిన్న ఘటన జరిగిన వెంటనే కేంద్ర మంత్రులు అమిత్ షా, రామ్మోహన్ నాయుడు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.