వైభ‌వోపేతం శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌రుడి ధ్వజారోహ‌ణం

శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి – అప్పలాయ గుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 7.30 నుండి 8.00 గంటల మద్య మిథున లగ్నంలో వైఖానసాగ మోక్తంగా ధ్వజారోహణ ఘట్టం జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.

అంతకు ముందు ఉదయం 5.30 నుండి 6.00 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామి వారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం ధ్వజ స్తంభం వద్ద విశేషపూజా కార్యక్రమాలు జరిగాయి. అంతకు ముందు భేరితాడనం, భేరిపూజ, ధ్వజపటం, నవసంధి, శ్రీవారి మాడ వీధి ఉత్సవం, ఆస్థానం నిర్వహించారు. మిథున లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు.

ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి నూతన వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. ఎన్ని దానాలు చేసినా ధ్వజారోహణ కార్యంలో గరుడారోహణం వీక్షించిన భక్తులు పునీతులు అవుతారని పురాణాలు చెబుతున్నాయి. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. సమాజ శ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజా రోహణం దోహద పడుతుంది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com