ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ను టార్గెట్ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ ఇద్దరు నిర్మాతలే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లపై ఒత్తిడి తీసుకు వచ్చారని, అందుకే మూకుమ్మడిగా జూన్ 1న థియేటర్లను మూసి వేయాలని నిర్ణయం తీసుకునేలా చేసిందని నర్మ గర్భంగా వ్యాఖ్యానించారు పవర్ స్టార్. ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తను నటించిన, ఎంఎం రత్నం నిర్మించిన చిత్రం హరి హర వీరమల్లు. దీనికి జయప్రకాశ్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే కావాలనే సినీ ఇండస్ట్రీలోని కొందరు టార్గెట్ చేసినట్లు వచ్చే భావనతో వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్బంగా తన గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరగడంపై తీవ్రంగా స్పందించారు ప్రముఖ సినీ నిర్మాత, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్. థియేటర్ల గురించి కూడా కుండ బద్దలు కొట్టాడు. తనకు తెలంగాణలో ఒక్క టాకీస్ కూడా లేదని స్పష్టం చేశాడు. తనపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్దమన్నాడు అల్లు అరవింద్.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఉన్న థియేటర్లు కొన్నే ఉన్నాయని, వాటిని కూడా తాను వదిలేసుకుంటున్నట్లు చెప్పాడు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తనకు 15 లోపే టాకీసులు ఉన్నట్లు వెల్లడించాడు. పాత అలవాటు కొద్ది ఆ నలుగురు నిర్మాతలలోతనను కలపడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను వేరని వారితో పోల్చవద్దని కోరాడు అల్లు అరవింద్.