హైదరాబాద్ -ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అలియాస్ వెంకట రమణా రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో ఇక నుంచి సినిమా టికెట్ల రేట్లు పెంచబోమంటూ ప్రకటించాడు. అయితే పెద్ద సినిమాలకు మాత్రం ఇది వర్తిస్తుందని స్పష్టం చేశాడు. రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఈ అంశంపై చర్చలు జరిపామని తెలిపారు దిల్ రాజు . వేరే వాళ్ల సినిమాలకే కాదు తాను తీసే సినిమాలకు కూడా టికెట్ ధరలు పెంచబోమంటూ స్పష్టం చేశాడు.
తాజాగా దిల్ రాజు చేసిన ప్రకటన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది. ఇప్పటికే అటు ఏపీ, ఇటు తెలంగాణ రాష్ట్రాలలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు కీలక సమావేశం నిర్వహించారు హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్ లో. ఇటీవలే అధ్యక్షుడిగా ఎన్నికైన సునీల్ నారంగ్ గెలిచిన 24 గంటల లోపే తన పదవికి రాజీనామా చేశారు. సంచలన కామెంట్స్ చేశారు. తనకు తెలియకుండానే ఎవరు పడితే వారు తమకు తోచిన రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వాపోయాడు.
ఇది పక్కన పెడితే ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టికెట్ ధరల పెంపు పై ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తను నటించిన హరి హర వీరమల్లు చిత్రం ఇవాళ జూన్ 12న గురువారం రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఊహించని రీతిలో నిర్మాత ఎంఎం రత్నం దానిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. దీనికి అంతటికి కారణం సినిమాకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ కొనేందుకు ముందుకు రాక పోవడం విస్తు పోయేలా చేసింది.