టాటా ఐపీఎల్ 2025 మెగా టోర్నీ ఆఖరి అంకానికి చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ ఆడేది ఎవరో తేలి పోయింది. క్వాలిఫయర్ -1లో అనూహ్యంగా ఆర్సీబీ చేతిలో ఓటమి పాలైన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ క్వాలిఫయర్ -2 మ్యాచ్ లో మాత్రం జూలు విదిల్చింది. ప్రధానంగా చెప్పుకోవాల్సింది కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గురించి. తను అద్భుతమైన నాయకుడిగా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ప్రత్యర్థి జట్టు విసిరిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు.
నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. అనంతరం మైదానంలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఏ మాత్రం తగ్గలేదు. కెవ్వు కేక అనిపించేలా ఆడింది. కెప్టెన్ అయ్యర్ చెడుగుడు ఆడాడు. ముంబై బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఫోర్లు , సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. తనకు తోడుగా నేహాల్ వధేరా రెచ్చి పోయాడు. తను కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. 48 పరుగులతో రాణించగా జాస్ ఇంగ్లీష్ 38 రన్స్ చేసి దుమ్ము రేపాడు.
అయ్యర్ 87 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. తన జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని చేకూర్చి పెట్టాడు. వీరిని ఔట్ చేసేందుకు ముంబై బౌలర్లు నానా తంటాలు పడ్డారు. అయినా వర్కవుట్ కాలేదు. మెగా టోర్నీలో ముంబై తొలి నాలుగు మ్యాచ్ లు వరుసగా కోల్పోయింది. చివరకు క్వాలిఫయర్ దాకా చేరుకుంది. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు కెప్టెన్ పాండ్యా. తనను ఓదార్చే ప్రయత్నం చేశాడు అయ్యర్.