హైదరాబాద్ – బీసీల కోసం అన్ని సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలన్నారు బీసీ సంఘం నేత ఆర్ . కృష్ణయ్య. ప్రభుత్వానికి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి లేదన్నారు. బీసీల కోసం కవిత ముందుకు వచ్చి మాట్లాడుతుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కవితక్కకు బీసీలు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. బీసీలు పోరాటం చేసే చారిత్రక సందర్భం వచ్చిందన్నారు. బీసీలకు 75 ఏళ్లుగా అన్యాయం జరుగుతోందన్నారు. కవిత బీసీ కాకపోయినా బీసీల కోసం పోరాడుతున్నారని కితాబు ఇచ్చారు.
ఆదివారం స్వయంగా ఎమ్మెల్సీ కవిత కృష్ణయ్య ఇంటికి వెళ్లారు. చాలా సేపు ఈ ఇద్దరు నేతలు దేశ, రాష్ట్ర రాజకీయాలపై విస్తృతంగా చర్చించారు. త్వరలోనే బీసీల కోసం పార్టీ కూడా పెడతారని కవితపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో వీరు కలవడం రాజకీయ వర్గాలలో కలకలం రేపింది. చర్చకు దారి తీసింది. ఈ సందర్బంగా ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. ప్రజా ఉద్యమం చేయకపోతే బీసీల హక్కులు నెర వేరే ప్రసక్తి లేదన్నారు. అన్ని చోట్లా అగ్రవర్ణాలకు చెందిన వారే ఆధిపత్యం చెలాయిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కోసం ఎవరు ఉద్యమం చేసినా బీసీలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం పులి మీద స్వారీ చేస్తుందన్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోందంటూ ధ్వజమెత్తారు ఆర్. కృష్ణయ్య. బీసీలు ఉద్యమం చేస్తేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయన్నారు.