హైదరాబాద్ – భారత రాజకీయ చరిత్రలో విలక్షణ నాయకుడిగా గుర్తింపు పొందారు రాహుల్ గాంధీ. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన కుటుంబం నుంచి వచ్చారు. అత్యున్నత చదువు చదువుకున్నారు. తనకు ముందు నుంచి ప్రజలంటే అభిమానం. వారి మధ్యన ఉండటం అంటే ఇష్టం కూడా. గతంలో ఏ రాజకీయ నాయకుడు ఇంతలా వ్యక్తిగత ట్రోల్స్ కు గురికాలేదు. తన తండ్రి రాజీవ్ గాంధీ దారుణ హత్యకు గురైనప్పుడు తన సోదరి ప్రియాంక గాంధీతో పాటు తను కూడా భయాందోళనకు లోనయ్యాడు. కానీ ఆ సంక్షోభ సమయంలో ఎంతో ఓపికతో వ్యవహరించారు తల్లి సోనియా గాంధీ.
ఆ తర్వాత దేశ రాజకీయాలు ఊహించని మలుపులు తిరిగాయి. అనూహ్యంగా తనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా వదులుకున్నారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఎన్నో అవినీతి ఆరోపణలు, కేసులు తట్టుకుని నిలబడేందుకు ప్రయత్నం చేశారు. ఈ సమయంలో తాను అనుకోని రీతిలో సోనియా గాంధీ తర్వాత ఏఐసీసీ పగ్గాలు చేపట్టారు. కానీ అనూహ్యంగా ఎన్నడూ లేని రీతిలో కాంగ్రెస్ చరిత్రలో అత్యంత దారుణమైన ఫలితాలను చవి చూసింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రాహుల్ గాంధీ తాను ఇక పాలిటిక్స్ లో కొనసాగలేనంటూ రాజీనామా చేసి వెళ్లి పోయాడు.
కొంత కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత అనూహ్యంగా తిరిగి భారత దేశానికి వచ్చాడు. ఎవరూ ఊహించని రీతిలో తనను తాను ప్రజల పక్షం వహించే నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇందుకు ప్రధానంగా దోహద పడేలా చేసింది మాత్రం తాను చేపట్టిన భారత్ జోడో యాత్ర. ఇది సంచలనం సృష్టించింది. ఒకానొక దశలో బలమైన భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంస్థలను, ముఖ్యంగా వన్ మాన్ షో చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చక్రం తిప్పుతున్న అమిత్ షాను భయపెట్టేలా చేసింది.
ఈ యాత్ర చారిత్రాత్మకం అని చెప్పక తప్పదు. భావ సారూప్యత కలిగిన వ్యక్తులు, సంస్థలు, మేధావులు , జర్నలిస్టులు, కవులు, కళాకారులు, గాయనీ గాయకులు, నటీ నటులు..ఆర్థికవేత్తలు..మాజీ సైనిక అధికారులు..వ్యాపార, క్రీడా, వాణిజ్య రంగాలకు చెందిన వారు రాహుల్ గాంధీతో జతకట్టారు. ఆనాటి స్వాతంత్రోద్యమ స్పూర్తిని తిరిగి జ్ఞాపకానికి తీసుకు వచ్చేలా చేసింది. మొత్తంగా రాహుల్ ఓ పరిణతి చెందిన నాయకుడిగా ఎదిగాడు. కానీ తన పార్టీని ఎలా పవర్ లోకి తీసుకు రావాలనే దానిపై ఇంకా సక్సెస్ కావాల్సిన అవసరం ఉంది.