జమ్మూ కశ్మీర్ – దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నిప్పులు చెరిగారు. గురువారం ఆయన జమ్మూ కశ్మీర్ లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కలిసి పర్యటించారు. ఈ సందర్బంగా భద్రతా దళాలతో సంభాషించారు. ఇటీవల చోటు చేసుకున్న ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా తన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో ఉదంపూర్ లో ప్రధాని మోదీ ఎయిర్ బేస్ ను సందర్శించారు. భద్రతా దళాలతో సంభాషించారు. వారికి సెల్యూట్ చేశారు. అనంతరం రాజ్ నాథ్ సింగ్ ఎంటర్ అయ్యారు.
ఈ సందర్బంగా ఆర్మీని ఉద్దేశించి ప్రసంగించారు . దాయాది దేశం పాకిస్తాన్ తన తీరు మార్చుకోవాలని లేక పోతే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. అణుబాంబుల బూచి చూపి బెదిరించాలని చూస్తే ఊరుకోమంటూ పేర్కొన్నారు రాజ్ నాథ్ సింగ్. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సైనిక దాడి ఆపరేషన్ సిందూర్ తర్వాత భద్రతా అంచనా వేయడానికి తాను వచ్చానని చెప్పారు.
ఇస్లామాబాద్ నుండి భారతదేశం అణు బ్లాక్మెయిల్ ను సహించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. పాక్ అణ్వాయుధాలను పర్యవేక్షించేందుకు అంతర్జాతీయంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
తమ దేశం విషయంలో ఇంకొకరి జోక్యాన్ని సహించే ప్రసక్తి లేదన్నారు. అమెరికా అయినా లేదా ఇతర ఏ దేశమైనా ఊరుకోబోమన్నారు. అనంతరం ఉగ్రవాదులతో పోరాడి అసువులు బాసిన అమర వీరులకు నివాళులు అర్పించారు రాజ్ నాథ్ సింగ్.