కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తను అత్యంత జనాదరణ పొందిన క్రికెటర్. ఐపీఎల్ లో గత కొన్నేళ్లుగా అద్భుతమైన పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఆ జట్టుకు వెన్నుముకగా ఉన్నాడు. స్కిప్పర్ గా జట్టును విజయ పథంలో నడిపించాడు. అయితే ఎప్పుడైతే రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ గా రాజస్థాన్ రాయల్స్ కు వచ్చాడో ఇక తను తప్పుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. దీనిని నిజం చేస్తూ ఇన్ స్టా స్టోరీస్ వేదికగా శాంసన్ మేనేజర్ కామెంట్ చేయడం ఈ పుకారుకు మరింత ఆజ్యం పోసినట్లయింది.
వాస్తవానికి మైదానంలోకి వచ్చాడంటే అలవోకగా షాట్స్ ఆడటంలో తనకు తనే సాటి. ముఖ్యంగా సిక్స్ లు బాదడంలో సూపర్. తాజాగా వచ్చే ఏడాది 2026లో జరిగే ఐపీఎల్ లో పాల్గొనే ఆటగాళ్ల వేలం పాటకు సంబంధించి ఇప్పటి నుంచే చర్చలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా సంజూ శాంసన్ గురించే ఎక్కువగా ప్రచారం జరుగుతుండడం విశేషం. తను రాజస్థాన్ ను వీడతాడని, తనను తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం చర్చలు జరుపుతోందని టాక్. దీనిపై ఇంకా మౌనం వీడలేదు సంజూ శాంసన్.
తన మేనేజర్ ప్రశోబ్ సుదేవన్ ఎక్స్ ఖాతా వేదికగా తను మారే ఛాన్స్ ఉందని పేర్కొన్నాడు. దీంతో శాంసన్ తప్పకుండా చెన్నైకి వెళ్లనున్నట్లు తన అభిమానులు పెద్ద ఎత్తున పేర్కొంటున్నారు. ఇక సంజూ తన ఐపీఎల్ కెరీర్ ను 2012లో ప్రారంభించాడు. ఈ సీజన్ లో గాయం కారణంగా ఎక్కువ మ్యాచ్ లు ఆడలేక పోయాడు. 2013 నుంచి 2015 వరకు రాజస్థాన్ తరపున ఆడాడు. ఆ తర్వాత 2015లో ఢిల్లీకి వెళ్లాడు. 2018లో తిరిగి రాజస్థాన్ జట్టుతో కలిశాడు. 2021లో కెప్టెన్ గా ఉన్నాడు. ఐపీఎల్ 2022లో ఫైనల్ దాకా తీసుకు వెళ్లాడు. రాజస్థాన్ రాయల్స్ చరిత్రలో తను 177 మ్యాచ్ లు ఆడాడు. 139.04 స్ట్రైక్ రేట్ తో 30.94 సగటుతో 4027 రన్స్ చేశాడు. ఈ సీజన్ లో 9 మ్యాచ్ లు ఆడి 285 పరుగులు చేశాడు.