హైదరాబాద్ – తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్ సంచలన ప్రకటన చేశారు. తాను అధ్యక్ష పదవి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది తన రాజీనామా వ్యవహారం. ఎవరైనా ఎన్నికయ్యాక కొంత కాలం పాటు ఉంటారు. కానీ మనోడు కేవలం పదవి దక్కిన 24 గంటల లోపే ఇక గుడ్ బై చెబుతున్నట్లు వెల్లడించడం వెనుక ఏమి జరిగి ఉంటుందని చర్చలు కొనసాగుతున్నాయి.
అయితే కొందరు చేసిన విమర్శలు తనను బాధకు గురి చేశాయని వాపోయాడు సునీల్ నారంగ్. వాస్తవాలు తెలుసు కోకుండా కామెంట్స్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. అధ్యక్షుడిగా తనకు సమాచారం ఇవ్వకుండానే ఎవరికి తోచినట్లు వారు ప్రకటనలు చేస్తున్నారని ఆవేదన చెందారు. తనకు వారు చేసిన వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ మేరకు ఇవాళ సునీల్ నారంగ్ మీడియాతో మాట్లాడారు. ఒక రకంగా టాలీవుడ్ కొందరి చేతుల్లోనే ఉందనేది వాస్తవం.
విచిత్రం ఏమిటంటే ప్రెసిడెంట్ గా వరుసగా సునీల్ నారంగ్ మూడవ సారి ఎన్నికయ్యాడు. ఇదిలా ఉండగా ఈ రాజీనామాకు ప్రధాన కారణం కొత్తగా ఫిలిం ఛాంబర్ కు కార్యదర్శిగా ఎన్నికైన వీఎల్ శ్రీధర్ చేసిన వ్యాఖ్యలేనని టాక్. పవన్ కళ్యాణ్ ను తప్పుదారి పట్టించడంలో కొందరు నిర్మాతలు, దర్శకులు ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. త్వరలోనే వారి పేర్లను బయట పెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు.