హైదరాబాద్ – జూన్ 1న థియేటర్లు మూసి వేయాలని తీసుకున్న నిర్ణయం వాయిదా పడింది. తెలుగు ఫిలిం ఛాంబర్ లో వాడి వేడిగా చర్చలు జరిగాయి. థియేటర్లు మూసి వేయాలని ఎగ్జిబిటర్ల నిర్ణయంపై చర్చలు కొనసాగాయి. ఉదయం 11 గంటలకు తెలుగు రాష్ట్రాలలోని 40 మంది డిస్ట్రిబ్యూటర్స్ హాజరయ్యారు. సాయంత్రం 4 గంటలకు తెలుగు ప్రొడ్యూసర్స్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లలో మెజారిటీ సభ్యులు సమ్మె వద్దు, థియేటర్లు రన్ చేస్తూనే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని సూచించారు. గతంలో క్యూబ్ సమస్యలపై కొన్ని రోజులు థియేటర్లు మూసి వేయాలని, ఆర్టిస్టుల రెమ్యునరేషన్లపై షూటింగుల నిలిపి వేయాలని ఇటీవల ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు విషయాల్లోనూ సత్ఫలితాలు రాక పోవడంతో, ఈ సారి థియేటర్లు మూత పడకుండా, సినిమాలు రన్ చేస్తూనే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని తెలిపారు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు.
ఇప్పటికే పైరసీ, ఐపిఎల్, ఓటీటీ రూపంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం చాలా తగ్గింది. మే 30 నుంచి వరుస సినిమాలు ఉండటంతో మరింత ఇబ్బంది అవుతుంది కాబట్టి, థియేటర్ల మూసివేత కార్యక్రమాన్ని పునరాలోచించుకుని తెలుగు ఇండస్ట్రీ అభివృద్ధికి సహకరించే విధంగా తోడ్పడాలని ఎగ్జిబిటర్లను కోరారు నిర్మాతలు.