తిరుపతి – కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తల్లియైన శ్రీ వకుళా మాత ఆలయం తృతీయ వార్షికోత్సవం జూన్ 20న నిర్వహించేందుకు టిటిడి ఘనంగా ఏర్పాట్లు చేపట్టింది. తిరుపతి సమీపాన పేరూరు బండపై శ్రీ వకుళామాత ఆలయం విరాజిల్లుతోంది. శ్రీనివాసుని దివ్య అనుగ్రహం, భక్తుల సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానములు సువర్ణ శోభితమైన దివ్య విమాన రాజగోపురములతో కూడిన సుందరమైన ఆలయాన్ని నిర్మించారు.
ఈ ఆలయంలో శ్రీవారి ఆజ్ఞ మేరకు శ్రీవారికి నిత్యోత్సవాది కైంకర్యములను నిర్వహించే శ్రీ వేఖానస భగవచ్ఛాస్త్రోక్త విధిగా సంప్రోక్షణాది కార్యక్రమములు నిర్వహించి భక్త జనులకు అమ్మ వారి దర్శనం కల్పించేందుకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అనది కాలంలోనే అమ్మవారి అనుగ్రహము వలన తమ అభీష్టసిద్ధి పొందిన భక్తులు విశేష సంఖ్యలో విచ్చేస్తున్నారు.
తృతీయ వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది టీటీడీ. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 5.30 నుంచి 6.00 గం.ల మధ్య సుప్రభాతం, ఉదయం 6 నుంచి 8 గం.ల మధ్య నిత్య కైంకర్యాలు, మూలవర్లకు అభిషేకం, అలంకారం, నివేదన, ఉదయం 09.00 నుంచి 11 గం.ల మధ్య విష్వక్సేనారాధన, పుణ్యా హవచనము, అంకురార్పణం, మహాశాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల 12 గం.ల మధ్య ఉత్సవ మూర్తులకు అష్టోత్తర శత కలశాభిషేకం చేపడుతారు.
ఈ సందర్బంగా అమ్మ వారి తృతీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తోంది. ప్రతి ఏటా ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.