అమరావతి – తనపై ABN ఛానల్, సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోల్స్పై మాజీ మంత్రి విడదల రజిని మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అత్యంత దారుణంగా దూషణలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ వాపోయారు. తనతో పాటు వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు, మాజీ మంత్రి రోజాను సభ్య సమాజం సిగ్గుపడేలా కామెంట్స్ చేస్తున్నారంటూ పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్న సదరు ఛానల్, ట్రోల్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మాజీ మంత్రి విడుదల రజని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా పాలన పేరుతో కొలువు తీరిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సర్కార్ ప్రజలను మోసం చేయడం తప్ప చేసింది ఏమీ లేదని ఆరోపించారు. కేవలం కక్ష సాధింపు చర్యలకు దిగడమే పనిగా పెట్టుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా మహిళలని చూడకుండా చిల్లర రాజకీయాలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు విడుదల రజని.
ఇప్పటికే తమ పార్టీకి చెందిన వారిని పనిగట్టుకుని అక్రమ కేసులు బనాయించారని, మరికొందరిని అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. తాజాగా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు విషయంలో భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందని, ఇకనైనా సర్కార్ తన తీరు మార్చు కోవాల్సిన అవసరం ఉందన్నారు విడుదల రజిని.