అమరావతి – మాజీ సీఎం జగన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై సెటైర్స్ వేశారు. ఆచరణకు నోచుకోని హామీలతో ప్రజలను బురిడీ కొట్టించారని, పవర్ లోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు . ఒక రకంగా పాలన పరంగా ఫెయిల్ అయ్యాడని ఆరోపించారు.
తాజాగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సంచలన రిపోర్టు బయట పెట్టింది. ప్రభుత్వం లోని డొల్లతనాన్ని బయట పెట్టిందని, ఇందులో దాచేందుకు ఏమీ లేదన్నారు జగన్ రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడారు. కాగ్ నివేదిక రాష్ట్రంలో వాస్తవ ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిందో, ఎంతటి ప్రమాద స్థితిలోకి వెళ్లిందో తేట తెల్లం చేసిందన్నారు . ఏప్రిల్ 2025లో రాష్ట్ర GST ఆదాయం ఏప్రిల్ 2024తో పోలిస్తే 24.20 శాతం తగ్గిందన్నారు. మొత్తం పన్ను ఆదాయం 12.21 శాతం తగ్గిపోగా, పన్ను యేతర ప్రాఫిట్ 22.01 శాతం తగ్గడం పట్ల ఆవేదన చెందారు జగన్ రెడ్డి.
గత సంవత్సరంతో పోలిస్తే మొత్తం రాష్ట్ర యాజమాన్య ఆదాయం 12.76 శాతం మేర తగ్గిందన్నారు. రాష్ట్ర ఆర్థిక విషయాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన వాదనలలోని వ్యత్యాసాలను జగన్ హైలైట్ చేశారు. నిరంతరం పేదరిక నిర్మూలన చేస్తానంటూ ప్రచారం చేసుకునే చంద్రబాబు ఎంత మంది పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకు వచ్చాడో చెప్పాలన్నారు. కేవలం ప్రచారం యావ తప్ప చేసింది ఏమీ లేదంటూ ధ్వజమెత్తారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.