అమరావతి – మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకప్పుడు తనకు అనుంగు అనుచరుడిగా పేరు పొందిన విజయ సాయి రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ సీఎం , వైసీపీ బాస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లొంగిపోయారని విమర్శించారు. కూటమికి మేలు చేయడానికి రాజ్యసభ సీటును అమ్మేశారని ఆరోపించారు. ప్రలోభాలకు లోనై ఆయన రాజ్యసభకు రాజీనామా చేశారని అన్నారు. ఎవరున్నా లేక పోయినా వైసీపీ బలంగానే ఉంటుందన్నారు.
అంతా ఆ దైవమే చూసుకుంటుందన్నారు జగన్ రెడ్డి. అమరావతి పనుల కోసం 2018లో టెండర్లు పిలిచామన్నారు. ఆనాడు ఖరారైన టెండర్ల విలువ రూ.41,170 కోట్లు అని , చంద్రబాబు పూర్తి చేసిన పనులు మినహా రూ.35 వేల కోట్లతో పనులు చేయాల్సి ఉందన్నారు. కానీ ఆ టెండర్లను ఎలా రద్దు చేస్తారంటూ ప్రశ్నించారు. మిగిలిన ఆ పనుల అంచనాలు అమాంతం పెంచేసి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ధనంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డిలు ఏం తప్పు చేశారో చెప్పాలన్నారు మాజీ సీఎం.
కేవలం కక్ష సాధింపు చర్యలు తప్పితే ఇంకోటి కాదన్నారు. కేవలం తనను లక్ష్యంగా చేసుకుని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు జగన్ మోహన్ రెడ్డి. మరో వైపు తాను విజయ సాయి రెడ్డి పై చేసిన ఆరోపణలకు పూర్తిగా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఎవరు ఏమిటి అనేది త్వరలోనే తెలుస్తుందన్నారు. ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని చెప్పారు. జగన్ చేసిన తాజా కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.