ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో కూట‌మి స‌ర్కార్ ఫెయిల్

నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల

అమ‌రావ‌తి – రాష్ట్రంలో కూట‌మి పాల‌న దారుణంగా త‌యారైంద‌ని అన్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. క‌నీసం ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను స‌రిగా నిర్వ‌హించ‌లేని వీళ్లు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారంటూ ప్ర‌శ్నించారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల రీ కౌంటింగ్ పై మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి, మంత్రి నారా లోకేష్ మ‌ధ్య వాద‌న‌లు దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లుగా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. అస‌లు మంత్రికి ప్ర‌చారంపై ఉన్నంత మ‌క్కువ విద్యార్థుల భ‌విష్య‌త్తు గురించి లేదంటూ ఫైర్ అయ్యారు.

ఇక వైసీపీ హయంలో ప్రతి ఏటా రీ కౌంటింగ్ లో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో 20 శాతం మంది తిరిగి అధిక మార్కులతో పాస్ అయితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న 30 వేల మందిలో 11 వేల మందికి తిరిగి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయంటే, పేపర్ల మూల్యాంకనంపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుందన్నారు. ఎంత క్రమశిక్షణతో పేపర్లు దిద్దారో తెలుస్తుందన్నారు. ఫలితాల్లో పారదర్శకత లేదని స్పష్టంగా తేలింద‌న్నారు.. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారనే దానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదన్నారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.

వాస్తవానికి ఫెయిల్ అయ్యింది విద్యార్థులు కాదు. పేపర్లు సరిగ్గా దిద్దలేని వైసీపీ, కూటమి ప్రభుత్వాలేన‌ని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్ ను నిర్ణయించడంలో ఫెయిల్ అయిన వీళ్ళు రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తారని ప్ర‌శ్నించారు. చదువులతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. విద్యార్థుల ప్రాణాలతో ఆటలు ఆడుకుంటున్నారు. ధన దాహం మీద ఉన్న శ్రద్ధ విద్యా వ్యవస్థను ఉద్ధరించడం మీద లేదన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com