విశాఖపట్నం – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నిప్పులు చెరిగారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవమన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లీడారు. తన ఫోన్ తో పాటు తన భర్త అనిల్ , కుటుంబీకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని వాపోయారు. ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారని గుర్తు చేశారు. ట్యాపింగ్ జరిగిన నా ఆడియో ఒకటి నాకే వినిపించారన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తానని ప్రకటించారు ఏపీపీసీసీ చీఫ్.
బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్న.. ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం అన్నారు. రేవంత్, చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఆనాడు జగన్, కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్న బోయిందన్నారు. తెలంగాణలో నన్ను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకు ఇద్దరు కలిసి వేసిన స్కెచ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమేనని బాంబు పేల్చారు.
ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ అంటూ మండిపడ్డారు. ఇప్పుడు సుబ్బారెడ్డి ఒప్పుకుంటాడా..అంటే అనుమానమేనని పేర్కొన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. జగన్ తన సొంత మేనల్లుడు,మేన కోడలు అస్థి కాజేసే అంశంలో సుబ్బారెడ్డి తో అబద్ధాలు చెప్పించాడని ఆరోపించారు. అప్పుడు జగన్, కేసీఆర్ చేసినవి అరాచకాలు మామూలివి కావన్నారు. వీరి అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా చిన్నదన్నారు.