సుదీర్ఘ కాలం గ్యాప్ తర్వాత దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చిత్రం థగ్ లైఫ్. ఇలయ నాయగన్ కీలక పాత్ర పోషించాడు. తనతో పాటు అందాల తార త్రిష కృష్ణన్, సిలాంబరసన్ ముఖ్య పాత్రల్లో ఇమిడి పోయారు. 38 ఏళ్ల కిందట కమల్ తో మణిరత్నం నాయకుడు తీశాడు. ఆ తర్వాత ఎందుకనో కమల్, మణి కలవలేక పోయారు. ముచ్చట కొనసాగుతూనే ఉన్నప్పటికీ సినిమా తీయడంలో కథ వర్కవుట్ కాలేదని ఈ మధ్యనే సినిమా ప్రమోషన్ సందర్బంగా చెప్పాడు కమల్ హాసన్.
ఈ ఇద్దరూ బంధువులు అవుతారు. చారుహాసన్ కూతురే సుహాసిని. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన థగ్ లైఫ్ ప్రేక్షకుల ముందుకు జూన్ 5న విడుదలైంది. తాజాగా ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 23 కోట్లు వసూలు చేసింది. కలెక్షన్ల పరంగా చూస్తే తొలి రోజున రూ. 15.5 కోట్లు సంపాదించగా రెండవ రోజున 55 ఆక్యుపెన్సీ తగ్గి రూ. 7.5 కోట్లకు చేరుకున్నాయి.
కన్నడ భాషపై కమల్ ఇటీవల చేసిన వ్యాఖ్యల చుట్టూ ఉన్న వివాదం ఈ సినిమాను తీవ్రంగా దెబ్బతీసింది, దీని ఫలితంగా కర్ణాటకలో సినిమా రిలీజ్ నిలిచి పోయింది. ఈ వివాదం ప్రభావం స్పష్టంగా థగ్ లైఫ్ పై కనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే కమల్ గత చిత్రాలైన విక్రమ్, ఇండియన్ 2 , మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 కలెక్షన్ల కంటే తక్కువే.
ఇక హిందీలో థగ్ లైఫ్ కు తొలి రోజు రూ. 65 లక్షలు రాగా రెండో రోజు ఆ సంఖ్య 25 లక్షలకు తగ్గి పోయింది. తమిళనాడులో కేవలం 31.41 శాతం ఆక్కుపెన్సీ మాత్రమే నమోదు కావడం విశేషం.